ఒక్కరోజే రూ.3 వేలు పెరిగిన తులం ధర
14 Oct 2025 (senani.net): సామాన్యులను ఊరిస్తున్న బంగారం .. సంపన్నులనూ సవాల్ చేస్తున్నది. కనీవినీ ఎరుగని రీతిలో రికార్డుల్ని బద్దలుకొడుతున్న పసిడి ధరలు.. రాకెట్ వేగంతో పైపైకి పరుగులు పెడుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే తులం రేటు దాదాపు రూ.3,000 ఎగబాకింది. ఫలితంగా తులం బంగారం రూ.1.30 లక్షలు దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. మార్కెట్ వర్గాల ప్రకారం.. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ తులం బంగారం ధర రూ.2,720 పెరిగి మునుపెన్నడూ లేనివిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,830కి ఎగబాకింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,21,150గా ఉంది. ఇక హైదరాబాద్లో కిలో వెండి ఒక్కరోజులోనే రూ.3వేలు పెరిగి రూ.1,86,200కి చేరింది. 2025లో బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే దాదాపు 50 శాతానికి పైగానే ధరలు పెరిగాయి. 2022తో పోలిస్తే మొత్తం పెరుగుదల 140 శాతానికి చేరుకుంది. ఈ నెల 18న ధనత్రయోదశి వస్తున్నది. ఈ రోజున బంగారం, వెండి కొనుగోళ్లు శుభప్రదమని దేశంలోని మెజారిటీ ప్రజల విశ్వాసం. అయితే మార్కెట్లో ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా.. అప్పటికల్లా రేట్లు ఇంకా పెరిగిపోవచ్చన్న అంచనాలైతే ఉన్నాయి. ఇదే జరిగితే 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు రూ.1,50,000 దాటిపోవచ్చన్న అభిప్రాయాలైతే బలంగా వినిపిస్తున్నాయి



